తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ సీనియర్ నేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన తన సంతాపం సందేశాన్ని వ్యక్తం చేశారు. కోట ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారన్నారు. తెలుగు భాష... యాసలపై ఆయనకు మంచిపట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారని గుర్తు చేశారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారని తెలిపారు.
కోట శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు. అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే కోట చిత్ర సీమకు పరిచయమయ్యారని, తన మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారని వెల్లడించారు. ఆ తర్వాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించినట్టు తెలిపారు. కోట శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, కోట శ్రీనివాసరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.