పడమటలంకలో కొత్త ఇంట్లోకి పవన్ కళ్యాణ్ దంపతులు

శుక్రవారం, 22 జూన్ 2018 (14:22 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం విజయవాడలోని పడమటలంకలో నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు ఓ ఇంటిని తీసుకున్న పవన్‌.. సతీసమేతంగా పూజా కార్యక్రమాలు చేసి కొత్త ఇంటిలోకి ప్రవేశించారు.
 
గుంటూరు జిల్లా నంబూరులో లింగమనేని టౌన్‌షిప్‌ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి దివ్య ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణతో వెళ్లిన పవన్‌ కల్యాణ్‌ అంతకుముందే అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు చేశారు. 
 
ఇందుకోసం గురువారమే హైదరాబాద్‌ నుంచి కుటుంబ సమేతంగా విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం నిరాడంబరంగా గృహప్రవేశం చేశారు. ప్రస్తుతం పవన్‌ విజయవాడకు ఎప్పుడొచ్చినా హోటల్‌లోనే బస చేస్తున్నారు. 
 
మరోవైపు, రామవరప్పాడు వద్ద ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని, కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమిపూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనులు త్వరగా ప్రారంభింపజేయాలని, ఈ లోగా ఈరోజు గృహప్రవేశం చేసిన నివాసంలో ఉంటూ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ముఖ్యనేతలతో సమావేశాల నిర్వహణ చేయాలని పవన్ భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు