చెత్త సేకరణకు కాలుష్య రహిత వాహనాలు: బొత్స

గురువారం, 5 నవంబరు 2020 (07:07 IST)
పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచుటతో పాటుగా కాలుష్యా రహిత సి.ఎన్.జి వాహనాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ నివాసముల నుండి చెత్త సేకరణ చేయుటకు నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృది శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ అన్నారు.
 
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద విజయవాడ నగరపాలక సంస్థ ఇంటింటి నుండి చెత్త సేకరణకై రూ. 2 కోట్ల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన 25 సి.ఎన్.జి వాహనముల ప్రారంభ కార్యక్రమములో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృది శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొని సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ గార్లతో కలసి వాహనములను లాంచనంగా ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నగర సుందరికరణలో భాగంగా నగరపాలక సంస్థ అనేక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, దీనిలో భాగంగా నేడు పారిశుధ్య నిర్వహణలో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన  ఇంటింటి నుండి తడి మరియు పొడి చెత్త సేకరణకై 25 సి.ఎన్.జి వాహనాలు కొనుగోలు చేయుట జరిగిందని, రాబోవు రోజులల్లో ప్రతి వార్డ్ నందు ఈ వాహనము ఏర్పాటు చేయుట జరుగుతుందని తద్వారా కాలుష్యాన్ని కూడా నియత్రించవచ్చునని అన్నారు.

అదే మాదిరిగా నగరాభివృధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు మంజూరు చేసి అనేక అభివృధి పనులు చేపట్టుటకు ప్రోత్సహిస్తూoదని, దీనిలో భాగంగా సింగ్ నగర్ ప్రాంతములో చెత్త డంపింగ్ ప్రదేశాన్ని పార్కుగా తీర్చిదిద్దుటకు పనులు జరుగుతున్నవని అన్నారు.

నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ అభివృధిలో భాగంగా గుంటూరు నందు టాటా వారిచే నూతనంగా ఏర్పాటు చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ త్వరలో ప్రారంభించుట జరుగుతుందని, నగరంలో ఉత్పతి ఆగుచున్న పొడి చెత్తను అక్కడకు తరలించుట ద్వారా రాబోవు రోజులలో నగరంలో చెత్త సమస్యను కూడా పరిష్కరించవచ్చునని అన్నారు.

నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కమిషనర్ అనేక సంస్కరణల అమలు చేయుట ద్వారా ఎప్పుడురాని విధంగా విజయవాడ నగరపాలక సంస్థ కు పారిశుధ్య నిర్వహణలో దేశoలోనే ఉత్తమ ర్యాంక్ సాధించినదని వివరిస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులు, కమిషనర్, అధికారులు మరియు సిబ్బందికి అభినందనలు తెలియజేసారు. నగర సుందరికరణకై మన నగరాన్ని పరిశుభ్రంగా చెత్త రహిత నగరంగా ఉంచుటకు ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని అన్నారు.  

ఈ సందర్భంలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ తడి మరియు పొడి చెత్తలను వేరువేరుగా సేకరించుటకు రెండు కాబిన్స్ కలిగిన సి.ఎన్.జి వాహనములు వినియోగించుట ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఇళ్ళ నుండి చెత్తను సేకరించుటకు అవకాశం ఉంటుందని 6 గురు సిబ్బంది స్థానములో కేవలం ఇద్దరు సిబ్బందిని వినియోగించ వచ్చునని అన్నారు.

పారిశుధ్య కార్మికులు తోపుడు బండ్ల స్థానములో సదరు వాహనము నేరుగా చిన్న చిన్న సందులలోకి వెళ్లి చెత్త సేకరిస్తుందని,  నివాసాల వారు తడి మరియు పొడి చెత్తలను వేరువేరుగా కేటాయించిన కాబిన్స్ నందు వేయవలసియున్నదని తెలియజేసారు.

సదరు వాహనము నందు సి.సి.కెమెరా ఏర్పాటు చేయుటతో పాటుగా జి.పి.ఎస్ కు అనుసంధానము చేయుట జరిగిందని, కంట్రోల్ రూమ్ నుండే పారిశుధ్య వాహనము యొక్క పని తీరు మరియు ప్రజలు చెత్తను విభజించి వేస్తున్నది లేనిది పర్యవేక్షించవచ్చునని వివరించారు. 

అదే విధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అవసరాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచుటకై మున్సిపల్ మంత్రి గారి చొరవతో అనేక నిధులు మంజూరు చేయుట జరుగుతుందని, రాబోవు రోజులలో విజయవాడ నగరాన్ని మరింతగా సుందరంగా తిర్చిదిద్దుట జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమములో పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు