జనసేనానికి అరుదైన గౌరవం....హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆహ్వానం

మంగళవారం, 17 జనవరి 2017 (17:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినిమా నటునిగా, ఇటు రాజకీయ నాయకునిగా తనకంటూ ప్రత్యేక ఛరిష్మాతో ముందుకు సాగుతున్న విషయం విదితమే. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నపవన్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.  అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’ ఈవెంట్‌లో ప్రసంగించే అవకాశం పవన్ కళ్యాణ్‌కు కల్పించింది. ఈ మేరకు బోస్టన్ వర్సిటీ అధికారులు ఆయనకు ఆహ్వానం పంపించారు. 
 
ఫిబ్రవరి 10,11వ తేదీల్లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున పవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పవన్ చదివినది కేవలం ఇంటర్ అయినా.. ప్రజా సమస్యలపై పోరాటం.. ఇటు పవర్‌స్టార్‌గా ఎదిగిన తీరు.. పవన్‌కు ఈ అవకాశం కల్పించాయని చెప్పాలి. 
 
ముఖ్యంగా ప్రాంతీయ నాయకులు అంతర్జాతీయ వేదికల నుంచి మాట్లాడటం ద్వారా తమ ప్రాపంచిక దృక్పథాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడలాంటి అరుదైన అవకాశం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను వరించింది. ఇదిలావుంటే, పవన్‌కు లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం పవన్ 'కాటమరాయుడు' సినిమా షెడ్యూల్లో బిజీగా ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి