రైతుల ఆందోళన : ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..

శనివారం, 30 జనవరి 2021 (15:32 IST)
రైతుల ఆందోళన దెబ్బకు సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివారుల్లో రెండు నెలలుగా అన్నదాతలు సాగిస్తున్న ఉద్యమం అంతకంతకూ ఉద్ధృతంగా మారుతోంది. 
 
శుక్రవారం సింఘు సరిహద్దు వద్ద స్థానికుల పేరుతో కొందరు రైతులపై దాడి చేయడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో హస్తిన సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు.. రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 
 
సింఘు, ఘాజీపుర్‌, టిక్రీ తదితర సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. జనవరి 31 రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించింది. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ తెలిపింది. 
 
రైతులు సరిహద్దును వీడి వెళ్లాలని స్థానికులుగా చెప్పుకొంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘు సరిహద్దులో ఘర్షణ పడ్డారు. రైతుల గుడారాలపైకి రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి, బాష్పవాయువు ప్రయోగించారు. 
 
ఖాళీ చేయాలంటున్నవారంతా కిరాయి గూండాలంటూ కొందరు వాలంటీర్లు రైతులకు సర్దిచెప్పి పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. టిక్రీ సరిహద్దు వద్ద కూడా ఇలాంటిదే పునరావృతమైంది. దీంతో భద్రతను పెంచారు. పెద్దఎత్తున బలగాలను మోహరించారు. 
 
మరోవైపు, మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ఆందోళన చేస్తున్న రైతులంతా సద్భావన దినం పాటిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాస దీక్షకు కూర్చున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు