ఢిల్లీలో హింసను ప్రేరేపించింది బీజేపీనే : శివసేన

గురువారం, 28 జనవరి 2021 (18:19 IST)
శాంతియుతంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడానికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ సర్కారేనని శివసేన ఆరోపించింది. ఢిల్లీలో హింస జరగడానికి బీజేపీనే ప్రధాన కారణమని పేర్కొంది. 
 
వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా సాగుతున్న రైతుల ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించిందని పేర్కొంది. గణతంత్ర దినోత్సవం రోజు దేశ రాజధానిలో చెలరేగిన హింస సమర్ధనీయం కాదని, దీనికి కేవలం రైతులనే నిందించడం తగదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో రాసుకొచ్చింది. 
 
నిజానికి గత రెండు నెలలుగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన శాంతియుతంగా సాగుతోందని, రైతులు ఎన్నడూ సంయమనం కోల్పోలేదని గుర్తు చేసింది.
 
కానీ, వారు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ భగ్నం చేసేందుకు రైతులను రెచ్చగొట్టి హింసకు మళ్లిస్తే వారి ఆందోళనను నీరుగార్చవచ్చని కేంద్ర ప్రభుత్వం కోరుకుందని పేర్కొంది. చేతిలో కర్రలతో కనిపించిన రైతులను జాతి విద్రోహులుగా పిలుస్తున్నారని.. కాల్పులు జరపండి.. హతమార్చండి అని పిలుపుఇచ్చిన వారంతా ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో ఇంకా మంత్రులుగా ఉన్నారని వ్యాఖ్యానించింది. 
 
ఖలిస్తానీలనే ముద్రవేసినా రైతులు శాంతంగానే ఉన్నారని శివసేన పత్రిక పేర్కొంది. ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక నిరసనలకు నేతృత్వం వహంచిన దీప్‌ సిధు పంజాబ్‌ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు సన్నిహితుడని ఆరోపించింది. ఈయనకు బీజేపీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు