సీఎం జగన్ ఆదేశం మేరకే దొంగ ఓట్ల నమోదు : ఎంపీ రఘురామరాజు

బుధవారం, 21 జూన్ 2023 (12:32 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ కనుసన్నల్లోనే ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదు విచ్చలవిడిగా జరిగిందని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ నిజమేనని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా కూడా అంగీకరించారని గుర్తు చేశారు. 
 
ఆయన వ్యాఖ్యలను అన్ని ప్రధాన దినపత్రికలు యధాతథంగా ప్రచురిస్తే, సాక్షి దినపత్రిక మాత్రం అది సర్వసాధారణ విషయమేనని కొట్టి పారేశారనే కథనాన్ని ప్రచురించడం పరిశీలిస్తే... ఈ దొంగ ఓట్ల నమోదు వెనుక మా పార్టీ ప్రమేయం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. 
 
ఓట్ల జంబ్లింగ్‌ వల్ల సాధారణ ఓటరు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేరని మచిలీపట్నానికి చెందిన దిలీప్‌ కుమార్‌ తన వ్యాజ్యంలో పేర్కొనడం అక్షరాలా నిజం. ఓటరు తన పోలింగ్‌ బూత్‌కు వెళ్లడానికి బద్దకిస్తారు. ఆలోగానే మా పార్టీ వారు దొంగ ఓటు వేసేస్తారని గుర్తు చేశారు. 
 
జగన్‌ ఆదేశాల మేరకు రెవిన్యూ అధికారుల సహకారంతో వాలంటీర్లు దొంగ ఓట్ల నమోదు ప్రక్రియకు తెరలేపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు వివరిస్తూ తాను లేఖ రాసినట్టు చెప్పారు. దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. 
 
'ఉభయ గోదావరి జిల్లాలోని 34 స్థానాల్లో ఒక్క స్థానం కూడా అధికార వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి రావద్దన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటల్లో ఎటువంటి దోషం లేదు. అలాగే 175కు 175 స్థానాలు మనకే రావాలన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యల్లోనూ తప్పులేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు