ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల అతి భారీ వర్షాలు... ప్రకాశం బ్యారేజికి వరద పోటు

సోమవారం, 19 అక్టోబరు 2020 (11:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా, సోమవారం, మంగళవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. 
 
ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా సోమవారం కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
 
మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది వరద రూపు దాల్చింది. విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దాంతో 70 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 
 
ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీగా వరద నీరు దిగువకు వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా లంక గ్రామాలు, ఇతర లోతట్టు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు.
 
ప్రకాశం బ్యారేజి వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 7.65 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 7.71 లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. 
 
ఏ క్షణాన్నైనా 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజి చేరొచ్చన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదిపై ఉన్న చివరి బ్యారేజి ప్రకాశం బ్యారేజి కావడంతో పరీవాహక ప్రాంతాల్లోని వరదనీరంతా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు