ఏపీలో అంగన్‌వాడీలకు మరిన్ని పోషక విలువలు కలిగిన బియ్యం

బుధవారం, 2 జూన్ 2021 (12:29 IST)
మహిళలు, చిన్నారులకు మరింత మెరుగైన సమతుల పోషకాహారాన్ని అందించలన్న ఆలోచనతో ప్రస్తుతము అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న సోర్టెక్స్ బియ్యానికి బదులుగా ఫోర్టీఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టు రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, మరిన్ని పోషక విలువలు కలిగిన ఫోర్టీఫైడ్ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్  పౌర సరఫరాల సంస్ధ ద్వారా జూన్  నెల నుండి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందన్నారు. 

భావితరాల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, తల్లి గర్భం నుండే సంపూర్ణ ఆరోగ్యానికి పునాదులు వేసే దిశగా, సూక్ష్మ పోషక విలువలతో పాటు రక్త హీనతను నివారించే ఐరన్, గర్భస్థ  శిశువు వికాసానికి ఉపకరించే ఫోలిక్ ఆమ్లం, నాడీ వ్యవస్ధ బలోపేతానికి అవసరమైన విటమిన్ బి 12  కలిగిన ఫోర్టీఫైడ్ బియ్యాన్ని అంగన్ వాడీలకు సరఫరా చేయనున్నామని డాక్టర్ కృతికా శుక్లా వివరించారు.

ఈ కార్యక్రమం వల్ల  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని  7.15 లక్షల గర్భిణీ స్త్రీలు, బాలింతలు,  36 నుండి 72 నెలల వయస్సు  గల 9.66 లక్షల పిల్లలకు లబ్ది చేకూరనుందన్నారు. ఫోర్టీఫైడ్ బియ్యం పంపిణీకి సంబంధించి క్షేత్ర స్థాయిలో అన్ని జిల్లాలలోని ప్రాజెక్ట్ డైరెక్టర్స్,  సిడిపిఓలకు తగిన సూచనలు ఇచ్చి విస్తృత ప్రచారం  చేయాలని ఆదేశాలు జారీచేసామన్నారు.

అంగన్ వాడీ కేంద్రాలతో అనుసంధానం అయిన లబ్ది దారులు అందరు ఎటువంటి అపోహలకు తావియ్యకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని  సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేసారు.

రాష్ట్రం లోని 55,607  అంగన్ వాడీ  కేంద్రాలలోని లబ్దిదారులకు  రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించడానికి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ  ప్లస్, వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పధకాలు అమలు చేస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు