గుంటూరు లోక్‌సభకు పోటీ చేయనంటే చేయను : వైకాపా లావు శ్రీకృష్ణదేవరాయలు

ఠాగూర్

ఆదివారం, 7 జనవరి 2024 (13:41 IST)
తాను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని వైకాపా సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఆయన ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ సూచించారు. దీనికి ఆయన నో చెప్పి బయటకు వచ్చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'నా అభిప్రాయాలతో సీఎం కన్విన్స్ అయ్యారని అనుకోవడం లేదు. గుంటూరు నుంచి పోటీ చేయాలనే సీఎం ప్రతిపాదనను నేను అంగీకరించలేదు. సీఎం బిజీగా ఉన్నందున మళ్లీ ఇప్పట్లో కలిసే పరిస్థితి లేదు' అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఇటీవల సీఎంను కలిసినప్పుడు గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాల్లో పోటీ విషయమై చర్చ జరిగిందన్నారు. పార్టీ నిర్ణయాలు, ప్రతిపాదనలు, ఆలోచనలు సీఎం చెప్పగా.. తన ఆలోచనలూ పార్టీకి వెల్లడించానని స్పష్టం చేశారు. నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నాననే వాదన వినిపించానన్నారు. 
 
అక్కడి నుంచే ఎందుకో స్పష్టంగా వివరించానని తెలిపారు. అయితే.. సీఎం తన అభిప్రాయాలతో కన్విన్స్ అయ్యారని అనుకోలేదన్నారు. నరసరావుపేట టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నకు.. 'ఇంకా అంతదూరం ఆలోచించలేదు' అని శ్రీకృష్ణదేవరాయలు సమాధానం ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు