వంగవీటి రాధపై దాడి జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

బుధవారం, 29 డిశెంబరు 2021 (10:09 IST)
టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్ చేసి హత్య చేయాలని చూస్తున్న నేపథ్యంలో, విచారణ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు. ఆయ‌న డీజీపీ గౌతం స‌వాంగ్ కు లేఖ రాశారు. 
 
 
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి భయనకంగా ఉంద‌ని, బెదిరింపులు, దాడుల‌ పరంపర కొనసాగుతోంద‌న్నారు. తాజాగా విజయవాడకు చెందిన టీడీపీ నేత వంగవీటి రాధాను టార్గెట్‌ చేశార‌ని, కొంతమంది తనపై దాడి చేయడానికి తనను వెంబడిస్తూ, రెక్కీ నిర్వహించారని రాధ చెప్పార‌ని అన్నారు. పట్టపగలే ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో జంగిల్‌ రాజ్, గూండా రాజ్‌ పాలన కొనసాగుతున్న వాస్తవాన్ని ఎత్తిచూపుతున్నాయ‌న్నారు. 
 
 
పారదర్శకంగా విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చూడటం అత్యవసరం అని, గతంలో జరిగిన చట్టవిరుద్ధమైన, హింసాత్మక సంఘటనలపై ఎటువంటి చర్యలు తీసుకోనందు వ‌ల్ల‌నే ఇటువంటి సంఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. వంగవీటి రాధపై దాడి జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని తెలిపారు. నేరస్థులపై తీసుకునే కఠినమైన చర్యలు మాత్రమే గూండా రాజ్ నుండి రాష్ట్రంలో ప్రజల ప్రాథమిక హక్కులు రక్షించబడతాయ‌న్నారు.
 
 
వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారంపై ఒత్తిడులకు తలొగ్గకుండా త్వరితగతిన, పారదర్శకంగా విచారణ జరిపి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులకు శిక్ష పడేలా చూడాల‌ని నారా చంద్ర‌బాబు డిజిపిని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు