అన్న వచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది : టీడీపీ మహిళా నేత అనిత

శుక్రవారం, 28 జులై 2023 (16:56 IST)
అన్న వచ్చాడు.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన మహిళలకు తగిన శాస్తే జరిగిందని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. అన్నవచ్చాడు.. ఆడబిడ్డలకు మూడింది అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ, 'అన్న పాలన రాష్ట్రంలో ఆడబిడ్డలకు శాపంగా మారిందన్నారు. ఇందుకు కేంద్రం చెబుతున్న లెక్కలే సాక్ష్యమన్నారు. ఇదే మాట మేం అంటే కేసులు పెట్టి వేధించిన వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కిక్కురు మనడం లేదన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాల సంఖ్య లక్షా 22 వేలని, గత మూడేళ్లలో ఇవి ఏకంగా 43 శాతం పెరిగాయని గుర్తు చేశారు. 
 
గత నాలుగేళ్లలో 22 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని తెలిపారు. వీరిలో 8,000 మంది చిన్నారులు ఉన్నారు. మహిళలపై జరిగిన దాడులు 14,500 ఉంటే వారి ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన సంఘటనలు ఆరున్నర వేలుగా ఉన్నాయని చెప్పారు. సామూహిక అత్యాచారాలు 44, యాసిడ్ దాడులు జరిగాయని, వాలంటీర్ల వేధింపుల ఘటనలు 4,320గా ఉన్నాయని తెలిపారు. 
 
ఇవన్నీ జగనన్న సాధించిన అద్భుతాలు. ఇవి అధికారికంగా జరిగిన ఘటనలు నమోదు కాని సంఘటనలు మరో 36 వేల వరకూ ఉన్నాయని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం జగన్ రెడ్డి మాత్రం సిగ్గు లేకుండా కుర్చీలో కొనసాగుతున్నారని ఆమె మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు