హైదరాబాద్: తెలంగాణకు చెందిన రాకేష్ ఆర్నె మిస్టర్ ఇండియా 2025 టైటిల్ను సాధించి రాష్ట్రానికి గర్వకారణమయ్యారు. మహబూబ్నగర్ జిల్లా నవపేట మండలం ధర్పల్లి గ్రామానికి చెందిన ఈ యువకుడు, గోవాలోని గోల్డెన్ క్రౌన్ రిసార్ట్స్లో జూన్ 19న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ను కైవసం చేసుకున్నారు. తాజాగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో రాకేష్ తన విజయ గాథను, భవిష్యత్ ఆకాంక్షలను పంచుకున్నారు. త్వరలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించాడు.
విజయానికి నిరంతర కృషి కారణం
రాకేష్ ఆర్నె మాట్లాడుతూ, "మిస్టర్ ఇండియా 2025 టైటిల్ నా కఠోర శ్రమ, కుటుంబం, మిత్రుల మద్దతు ఫలితం. ఫిట్నెస్, ఆత్మవిశ్వాసం, సామాజిక అవగాహనతో ఈ పోటీలకు సన్నద్ధమయ్యాను. నా తదుపరి లక్ష్యం ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ 2025 పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం" అన్నారు. ఆయన సామాజిక సేవ, టాలెంట్ ప్రదర్శన, అంతర్జాతీయ అవగాహనతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ఆయన ప్రవేశపెట్టిన "సోషల్ ప్రాజెక్ట్ – ఆత్మవిశ్వాసం" అనేక మందిపై ప్రభావం చూపింది.
గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయికి
1995 ఆగస్టు 25న జన్మించిన రాకేష్, సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి యాదయ్య సామాజిక సేవకుడిగా, తాత వెంకటయ్య స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయనకు స్ఫూర్తినిచ్చారు. హైదరాబాద్లోని గవర్నమెంట్ సిటీ కాలేజీలో బీకామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్) పూర్తి చేసిన రాకేష్, 9 సంవత్సరాలుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నిష్ణాతుడైన ఆయన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో నివసిస్తున్నారు.
సామాజిక సేవలో రాకేష్ సేవలు
రాకేష్ ఆర్నె స్థాపించిన రక్ష గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 34 సార్లు రక్తదానం, 47 మంది బాల కార్మికుల రక్షణ, 77 మంది వృద్ధులకు ఆశ్రయం, అనాథలు, అంధులు, వికలాంగులకు సహాయం, ఉచిత వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SDGs) కోసం కృషి చేస్తున్నారు. మలేషియాలో జరిగిన మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు.
సినిమా రంగంలోకి అడుగు, యువతకు స్ఫూర్తి
మోడలింగ్, ఫిట్నెస్, లైఫ్ కోచింగ్లో అనుభవంతో రాకేష్ యువతకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. సినిమా రంగంలో అడుగుపెట్టాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన ఆయన, ఫిట్నెస్, మానసిక ఆరోగ్యంపై శిక్షణ క్యాంపులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. 2025లో జోష్ టాక్స్ తెలుగు, టెడ్ఎక్స్ తెలుగు వేదికలపై ప్రసంగించనున్నారు. అలాగే, "మిస్టర్ ఇండియా టాక్స్" అనే యూట్యూబ్ సిరీస్ను ప్రారంభించి యువతకు స్ఫూర్తినివ్వనున్నారు.
ప్రజల ఆదరణ, భవిష్యత్ లక్ష్యాలు
రాఖీగా ప్రజల ఆప్యాయత పొందిన రాకేష్, వినమ్రత, నిజాయతీతో అందరి మనసులు గెలిచారు. ఇండోనేషియాలో జరిగే మిస్టర్ వరల్డ్ గ్లోబల్ 2025లో భారత జెండాను ఎగరవేయాలని, రక్ష గ్లోబల్ ఫౌండేషన్ను మరిన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. "కష్టపడితే ఏదైనా సాధ్యమే" అని యువతకు సందేశమిస్తూ, రాకేష్ ఆర్నె తెలంగాణ నుంచి ప్రపంచ వేదికపై స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
"విజయం నా బలం, చిరునవ్వు నా ఆయుధం. సవాళ్లను స్వీకరించే సిద్ధంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు." అని చెప్పుకొచ్చారు.