ఏపీ రాజధాని అమరావతి ప్రాంత మహిళలంతా వేశ్యలంటూ మురికి వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు బ్యాంకు ఖాతాలోకి భారీగా డబ్బులు జమ అయ్యాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తే.. ఏమో నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చాడు. అమరావతి మహిళలను వేశ్యలతో పోల్చి జైలుపాలైన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా, ఆయన బ్యాంకు ఖాతాలోకి భారీగా డబ్బులు జమ అయిన విషయాన్ని గుర్తించారు. మీ బ్యాంకు ఖాతాలో అన్నిసార్లు డబ్బులు జమయ్యాయి. ఎవరు జమ చేశారు. ఎందుకు చేశారు. అన్ని ఖాతాల నుంచి అలా సొమ్ము జమ కావడమేంటి. అసలు మీకు ఆదాయం ఎలా వస్తుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
బ్యాంకు ఖాతాల వివరాలు ముందుపెట్టి ప్రశ్నించినా ఆయన నాకు తెలియదు.. గుర్తు లేదు అంటూ దాటవేసినట్టు సమాచారం. కృష్ణంరాజును మూడు రోజుల కష్టడీకి తీసుకున్న పోలీసులు శుక్రవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉంచి ప్రశ్నించారు. రాత్రివరకు కొనసాగిన విచారణలో సుమారు 40 ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పష్టంగా సమాధానం చెప్పకుండా, దాటివేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు ఎక్కడెక్కడి నుంచి సొమ్ము జమ అయిందో కీలక ఆధారాలు సేకరించి వాటి ఆధారంగా ప్రశ్నలు సంధించారు.