నూతన రాష్ట్రంలో మద్యం విక్రయాలపై రాష్ట్రప్రభుత్వం పలు నియమనిబంధనలను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతులుండగా వాటిని ఏ ఒక్క దుకాణాదారుడు పాటించడం లేదు. తిరుపతి నగరంలో 40 మద్యం దుకాణాలు, 8 బార్లు ఉండగా వాటి నుంచి ఎక్సైజ్ శాఖ, అర్బన్ జిల్లా పోలీసులు మామూళ్ళకు అలవాటు పడి ప్రభుత్వ నియమ నిబంధనలను అమలు చేయడం లేదు.
యథేచ్ఛగా మద్యం దుకాణాలలో కల్తీ జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి అర్బన్ పరిధిలోని 25కిపైగా దుకాణాలలో మద్యం కల్తీ జరుగుతోందని ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. అయినా వాటిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల లీలామహల్ సమీపంలోని మద్దిమానుల వద్ద గల ఒక దుకాణంలో కర్ణాటక రాష్ట్రం నుంచి అతి తక్కువగా తీసుకువచ్చిన మద్యంను బ్రాండెడ్ కంపెనీలలో కలుపుతుండడాన్ని అధికారులు గుర్తించారు.