బ‌ద్వేలులో కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రక అవసరం

సోమవారం, 25 అక్టోబరు 2021 (15:47 IST)
బద్వేలు ఉప ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన చారిత్రక అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం ఆయన వేంపల్లె లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు నరేంద్ర మోడీ పాలనలో ఎంత పెరిగాయో ప్రజలకు తెలుసన్నారు. రెండు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఉద్యోగాలు భర్తీ చేయక పోవడంతో యువత నిర్వీర్యమైపోతోందని తులసి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రానున్న రోజుల్లో నిర్ణయాలు తీసుకునేటపుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని అన్నారు. ప్రత్యేక హోదా వల్ల  రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పధకం, సర్వ శిక్ష అభయాన్  తదితర కేంద్ర ప్రయోజి త పథకాలకు సంబంధించి హోదా ఉన్న రాష్ట్రాల కు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు భరిస్తాయని తెలిపారు. హోదా లేని రాష్ట్రాల్లో కేంద్ర  ప్రభుత్వం 60 శాతం నిధులు మాత్రమే భరిస్తుందని అన్నారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, తదితర విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు 90 శాతం నుంచి 100 శాతం వరకు నిధులను కేంద్రమే భరిస్తుందని, హోదా లేని రాష్ట్రాలలో మొత్తం ఖర్చును ఆ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు.
 
 సెంట్రల్ ఎక్సైజ్, ఇన్ కంటాక్స్, కార్పొరేట్ టాక్స్ , కస్టమ్స్ డ్యూటీ తదితర కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో హోదా ఉన్న రాష్ట్రాలకు రాయితీలు లభిస్తాయన్నారు. ఇందువల్ల పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపిస్తారని, తద్వారా యువతకు ఉపాధి లభించి నిరుద్యోగ సమస్య నివారింపబడుతుందని అన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. 2014  ఫిబ్రవరి 20 న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదాను పార్లమెంట్ లో ప్రకటించారని, సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని తులసి రెడ్డి పేర్కొన్నారు. 
 
2014 మార్చ్ 1న మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం హోదాపై తీర్మానం చేసి అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించిందని చెప్పారు. 2014  మార్చ్ 5న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కారణంగా ప్రణాళికా సంఘం అమలు చేయలేకపోయిందని, ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ప్రత్యేక హోదా తక్షణమే అమలై ఉండేదని, నవ్యాoధ్ర  ప్రదేశ్ స్వర్ణాంద్ర ప్రదేశ్ అయి ఉండేదని తులసి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాబట్టి బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ లను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మను గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు