29 నుండి రోజుకు రెండు గ్రామాలలో టీకా పంపిణీ: జగన్

గురువారం, 25 మార్చి 2021 (09:41 IST)
ఈ నెల 29వ తేదినుండి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండు గ్రామాలను లక్ష్యంగా తీసుకుని టీకా వేయాలని, అదే విధంగా ఒక్కో మండలంలో నాలుగురోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు.

పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన మండలాల్లో ఈ తరహాలో టీకా వేయడాన్ని చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.నాలుగైదు వారాల్లో కోటి మందికి కరోనా టీకా వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.

ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు పూర్తికానందున మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని సందిగ్ధంలో అధికార యంత్రాంగం ఉందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోందన్నారు.

కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందించడానికి గతంలో ఉన్న సదుపాయాలన్నీ కొనసాగాలన్నారు. వీలైనంత త్వరగా విలేజ్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావాలని పిహెచ్‌సిల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని చెప్పారు.

మండలానికి రెండు పిహెచ్‌సిలు, ఒక్కో పిహెచ్‌సికి ఇద్దరు వైద్యులు ఉండాలని, ప్రతి మండలానికీ రెండు 104 వాహనాలు ఉండాలని సూచించారు.

ప్రతి వాహనానికీ ఒక డాక్టర్‌ చొప్పున మండలానికి ఆరుగురు వైద్యులు ప్రతి మండలంలోనూ ఉండాలన్నారు. నెలకు మూడు సార్లు వైద్యుడు ప్రతి గ్రామాన్నీ సందర్శించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు