చేనేతను ధరించి నేతన్నను ఆదరించండి: హోం మంత్రి మేకతోటి సుచరిత

గురువారం, 20 మే 2021 (20:49 IST)
చేనేత వస్త్ర ధారణ వల్ల కలిగే విభిన్న ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి నేత కార్మికులను ఆదరించాలని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం శాసన సభ లాబీలో ఆప్కో ద్వారా రూపొందించిన నూతన చేనేత డిజైన్లు కలిగిన చీరలను మంత్రి ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా హోమ్ మంత్రి సుచరిత మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చేనేత బతుకుల్లో చీకట్లు అలముకున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చాక చేనేతల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, అనతి కాలంలోనే చేనేత పరిశ్రమ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
 
నేతన్న నేస్తం కింద ఏటా రూ.195 కోట్లు విడుదల చేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా నేత కార్మికులకు లబ్ది చేకూరుతుందన్నారు. ఆప్కో బలోపేతం కోసం కృషి చేస్తున్న చైర్మన్ చిల్లపల్లి మోహనరావు అభినందనీయిలన్నారు. నూతన ట్రెండ్‌కు అనుగుణంగా యువత, మహిళలు మెచ్చే విధంగా నూతన డిజైనులకు రూపకల్పన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
 
ఆప్కో చైర్మన్‌గా నాలుగు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి చేనేతల స్థితిగతులను అధ్యయనం చేసి, పాత డిజైన్లకు స్వస్తి పలికి ట్రెండ్‌కు అనుగుణంగా నూతన డిజైన్లు రూపొందించాలని, రంగుల వాడకంలోనూ కొత్త ఒరవడిని అవలంభించాలని నేత కార్మికులకు సూచించారు. తన స్వీయ పర్యవేక్షణలో అనేక నూతన డిజైన్లకు రూపకల్పన చేసారు.
 
 అలా తయారైన చేనేత చీరలకు విస్తృతమైన ప్రచారం కల్పించి చేనేత రంగం, ఆప్కో సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నూతన డిజైన్లతో తయారైన చీరలను హోమ్ మంత్రి సుచరిత చేతుల మీదుగా అందజేసి, వాటి తయారీకి సంబంధించి తీసుకున్న ప్రత్యేక చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, శాసన సభ్యులు విడుదల రజిని, జొన్నలగడ్డ పద్మావతి, రెడ్డి శాంతి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, జీఎం ఎల్.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు