కేసీఆర్ గారూ.. కవిత గారు రాలేదేం...? దణ్ణం పెట్టి వెళ్లిపోయిన కేసీఆర్

సోమవారం, 27 మే 2019 (12:33 IST)
తిరుమల శ్రీవారిని తెలంగాణా సిఎం కెసిఆర్ దర్శించుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత తిరుమల శ్రీవారిని కెసిఆర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కెసిఆర్ తిరుమలకు వచ్చినప్పుడు కొడుకు కెటిఆర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులను వెంటపెట్టుకుని దర్శనానికి వచ్చారు. 
 
కానీ ఈసారి వీరెవరు రాలేదు. ముఖ్యంగా కుమార్తె కవిత రాలేదు. కవితకు తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి. అయితే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎంపిగా కవిత ఓడిపోవడం ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కవితపై ఏకంగా 150 మందికి పైగా పసుపు రైతులు పోటీ చేశారు. రైతు సమస్యలను కెసిఆర్ పట్టించుకోవడం లేదంటూ కవితపై రైతులు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి చివరకు కవిత ఓడిపోవాల్సి వచ్చింది.
 
దీంతో కవితను తిరుమలకు తీసుకెళదామనుకుని ఒప్పించే ప్రయత్నం చేసినా ఆమె ఒప్పుకోలేదు. తిరుమల శ్రీవారి దర్శనం తరువాత ఆలయం నుంచి బయటకు వస్తున్న కెసిఆర్‌ను మీడియా ఇదే ప్రశ్నించేందుకు ప్రయత్నించింది. సర్.. కవిత గారు.. మీ కొడుకు ఎవరూ రాలేదేంటి అని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధుల ముఖం చూస్తూ దణ్ణం పెడుతూ కెసిఆర్ వెళ్ళిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు