''నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్'' అన్న రోజే వైఎస్సార్ చనిపోయారు: రోజా ఫైర్

గురువారం, 1 నవంబరు 2018 (14:47 IST)
ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ''నాతో పెట్టుకుంటే నువ్వు ఫినిష్'' అని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో అన్నారని.. అదే రోజు హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తన రాజకీయ ఎదుగుదల కోసం చంద్రబాబు ఎవరినైనా అడ్డు తొలగించుకుంటారని రోజా ఆరోపించారు. 
 
రాజకీయంగా అడ్డొచ్చిన కుటుంబ సభ్యులనే పక్కకు తప్పించిన చరిత్ర చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న అశేష ప్రజాదరణను తట్టుకోలేక జగన్‌పై చంద్రబాబు ఈ దాడి చేయించారని ఆరోపించారు. 
 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో సమావేశమైన అనంతరం వైసీపీ నేతలతో కలిసి రోజా మీడియాతో మాట్లాడారు. కేంద్ర విచారణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించగానే చంద్రబాబు కేంద్రం కాళ్లు పట్టుకుంటారని రోజా ఎద్దేవా చేశారు.
 
దేశం, రాష్ట్రాలు బాగుండాలంటే చంద్రబాబును భారత్ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో సఖ్యత కారణంగా.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ నేతలతో చంద్రబాబు సమావేశమవుతున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం జగన్‌కు భద్రతను పెంచుతుందన్న నమ్మకం తమకు లేదనీ, జగన్‌ను తామే కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు