ప్లీజ్... మూడు రాజధానులకు మద్దతివ్వండి : షా వద్ద సీఎం జగన్ మొర

బుధవారం, 16 డిశెంబరు 2020 (08:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. అత్యంత ప్రధానంగా మూడు రాజధానులకు బీజేపీ మద్దతు ఇవ్వాని విజ్ఞప్తి చేశారు. అలాగే, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. 
 
కాగా, మంగళవారం సాయంత్రం అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాత్రి 8.34 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు విషయాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 
 
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలో భాగంగానే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, విశాఖపట్టణం, అమరావతి, కర్నూలును పరిపాలన, శాసన, న్యాయ రాజధానులుగా చేస్తూ చట్టం చేసినట్టు కేంద్రమంత్రికి జగన్ వివరించారు. అందువల్ల మూడు రాజధానులకు బీజేపీ మద్దతు ఇవ్వాలని కోరారు. 
 
అంతేకాకుండా, హైకోర్టును కర్నూలుకు తరలించాల్సిన ప్రక్రియను ప్రారంభించాల్సి ఉందని, ఇందుకోసం నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. గత ఎన్నికల సమయంలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
 
అలాగే, కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656 కోట్లకు పెంచాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, కరోనా నేపథ్యంలో అదనంగా రుణాలు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని, 2013-14 నుంచి 2018-19 మధ్య కేంద్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చేపట్టిన బియ్యం పంపిణీకి కేంద్రం నుంచి రాయితీ రూపంలో రావాల్సిన రూ.1,600 కోట్లను వెంటనే విడుదల చేయాలని, జీఎస్టీ బకాయిలు ఇలా.. తన సమస్యలను సీఎం జగన్ ఏకరవు పెట్టినట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు