సాగు చట్టాల విషయంలో తప్పు జరిగింది... హోంమంత్రి అమిత్ షా

మంగళవారం, 15 డిశెంబరు 2020 (12:20 IST)
కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద సాగు చట్టాలను తీసుకొచ్చింది. కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాసేందుకే ఈ తరహా చట్టాలను తీసుకొచ్చారంటూ రైతులు ఆందోళనబాట పట్టారు. గత 20 రోజులుగా రైతుల దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. వీరితో కేంద్రమంత్రులు పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు. 
 
ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సాగు చట్టాలపై స్పందించారు. వివాదాస్పదమైన రైతు చట్టాల విషయంలో, ముందుగానే రైతు నేతలను, సంఘాలను సంప్రదించకపోవడం తప్పేనని అంగీకరించారు. ఈ విషయాన్ని నిరసనల్లో పాల్గొంటూ, ప్రభుత్వంతో చర్చలకు హాజరవుతున్న రైతు నేత శివకుమార్ శర్మ కాకాజీ తెలిపారు. 
 
అయితే, అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న విషయాన్ని హోమ్ శాఖ వర్గాలు ధ్రువీకరించాల్సి వుంది. కాగా, సోమవారం హర్యానాకు చెందిన పలువురు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి తోమర్‌ను కలిసి, తక్షణం తమ ఆందోళనలను విరమించేలా రైతులను ఒప్పించకుంటే, నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరారు. ఆ తర్వాత తోమర్ వెళ్లి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని చర్చించారు.
 
ఇదిలావుండగా, ఈ చట్టాలపై అంశాల వారీగా చర్చించి, ఓ నిర్ణయానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం పేర్కొంది. చట్టాల రద్దుకు మాత్రం అవకాశాలు లేవని, అయితే, రైతులకు ఉన్న అన్ని అనుమానాలనూ నివృత్తి చేస్తామని కేంద్రం చెబుతోంది. ఇదేసమయంలో చట్టాల రద్దు మినహా తమకు మరే ఇతర పరిష్కారం ఆమోదయోగ్యం కాదని రైతు సంఘాల నేతలు భీష్మించుకుని ఉన్నారన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు