నాడు ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇపుడు కండిషన్స్ అప్లై అని చెప్పడం ఏమిటని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా అమలవుతుందని, అయితే, ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులంటూ ప్రభుత్వం నిబంధన పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దీనిపై భారతి స్పందిస్తూ, ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని ఇపుడు షరతులు వర్తిస్తాయని అనడం దారుణమని విమర్శించారు.
ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌలభ్యం కేవలం జిల్లా స్థాయి వరకే పరిమితమని చెప్పడం మోసపూరిత చర్యే అవుతుందన్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే ఇలాంటి కుంటి సాకులు చెబుతుందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాన చేస్తున్నారని మండిపడ్డారు.
పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టిన ఈ ప్రభుత్వం.. రేపు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేసరికి నియోజకవర్గం, మండల పరిధి వరకే ఉచిత ప్రయాణం అంటుందేమో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా అమలవుతుందని ఆమె గుర్తు చేశారు.
ఇది ఒక మంచి పథకమన్నారు. ఇలాంటి పథకాన్ని అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదన్నారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా అని ప్రశ్నించారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండాలని మహిళల తరపున కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.