ప్రచార రథం సిద్ధం: రేపటి నుంచి ఎన్టీఆర్ ప్రచారం

WD
తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచార రథాన్ని సైతం సిద్ధం చేసుకున్నారు. తాత ఎన్టీఆర్ నిలువెత్తు చిత్రంతో పార్టీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, హరికృష్ణ చిత్రాలతో కూడిన ఈ ప్రచార రథం వెనుక భాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోనూ చిత్రీకరించారు.

ఇలా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన రథాన్ని మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా ప్రచార రథంలోని ఏర్పాట్ల గురించి, ప్రచారం గురించి చంద్రబాబు, ఎన్టీఆర్‌లు కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ప్రచార రథాన్ని ఎక్కిన చంద్రబాబు దాని లోపలిభాగాన్ని పరిశీలించారు.

అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌ను విలేకరులు చుట్టుముట్టగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. తాను చెప్పాలనుకున్నది ఇచ్చాపురంలోనే చెబుతానన్నారు. గురువారం ఉదయం 11.36 నిమిషాలకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్ఛాపురంలో తన పర్యటనక శ్రీకారం చుట్టనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా చేపడుతున్న ఈ రోడ్ షో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 రోజులపాటు కొనసాగనుంది.

వెబ్దునియా పై చదవండి