పవిత్రమైన దేవాలయంలోనే దారుణం జరిగింది. ఆశీర్వాదం, ప్రత్యేక పూజల పేరుతో ఓ నటితో ఆలయ పూజారి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం మలేషియా ఆలయంలో జరిగింది. ఈ మేరకు భారత సంతతికి చెందిన నటి మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక హిందూ పూజారి తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఆరోపించింది. మలేషియాలోని సెపాంగ్లో ఉన్న మరియమ్మన్ ఆలయంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు.
దీనిపై సెఫాంగ్ జిల్లా పోలీస్ చీఫ్ నార్హిజామ్ బహమన్ ఈ ఘటనపై స్పందించారు. నిందితుడు భారత జాతీయుడని, ఆలయంలోని ప్రధాన పూజారి అందుబాటులో లేకపోవడంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. బాధితురాలిపై పవిత్ర జలం చల్లినట్టు నటించి, ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు వివించారు. పరారీలో ఉన్న నిందితుడైన పూజారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.