కరోనావైరస్ లాక్‌డౌన్‌‌తో భారత్‌లో ఒక్కనెలలోనే నిరుద్యోగులుగా మారిన 12.2 కోట్ల మంది

శుక్రవారం, 8 మే 2020 (16:38 IST)
భారత్‌లో దేశ వ్యాప్తంగా విధించిన కరోనావైరస్ లాక్ డౌన్‌తో ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ఒక ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) విడుదల చేసిన అంచనాల ప్రకారం భారత్‌లో నిరుద్యోగ రేటు 27.1 శాతంగా నమోదైంది.
 
ఈ డేటా ప్రకారం భారతదేశంలో నిరుద్యోగుల సంఖ్య అమెరికా కన్నా నాలుగు రెట్లు అధికంగా ఉంది. నిరుద్యోగం గురించి భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సమాచారం విడుదల చేయలేదు. కానీ సీఎంఐఈ విడుదల చేసిన వివరాలను ఆమోదయోగ్యమైన సమాచారంగా పరిగణిస్తారు.
 
కోవిడ్-19 ఇన్ఫెక్షన్లని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు భారీ సంఖ్యలో 'లే ఆఫ్' అమలు చేశాయి. దేశంలో మే 6 నాటికి సుమారు 49000 మంది కరోనావైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
 
మార్చి నెలలో 8.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఏప్రిల్ నాటికి 23.5 శాతానికి చేరింది. ఈ పరిస్థితికి లాక్ డౌన్ కారణమని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలైన హాస్పిటళ్లు, మందుల షాపులు, నిత్యావసర సరకులు అమ్మే దుకాణాలు తప్ప మరేవీ పని చేయలేదు.
 
కొన్ని వేల మంది వలస కార్మికులు, రోజు కూలీలు పనులు లేక తమ స్వస్థలాలకు నడిచి వెళుతున్న చిత్రాలు ఏప్రిల్ నెల అంతా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో 90 శాతం మందికి ఉద్యోగాలు కల్పించే నిర్మాణ రంగ పనులు ఆగిపోవడంతో ఉద్యోగాలు పోయాయి. ఇది కేవలం అసంఘటిత రంగానికే పరిమితం కాలేదు. అనేక వ్యాపారాలు మూత పడ్డాయి. స్థిరమైన ఉద్యోగాలు ఉన్నవారు కూడా లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
 
గత కొన్ని వారాలలో మీడియా, విమానయాన, రిటైల్, హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ రంగాలలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. చిన్న వ్యాపారాలు కూడా మూత పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సీఎంఐఈ డేటాని నిశితంగా పరిశీలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ పై లాక్ డౌన్ చూపించిన ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
 
ఉపాధి కోల్పోయిన 12.2 కోట్ల మందిలో 9.13 కోట్ల మంది చిన్న వ్యాపారులు, కార్మికులు ఉన్నారు. వీరితోపాటు 17.8 కోట్ల మంది ఉద్యోగులు, 18.2 కోట్ల మంది సెల్ఫ్-ఎంప్లాయిడ్ వ్యక్తులు కూడా తమ ఉపాధి కోల్పోయారు. భారత ఆర్థిక వ్యవస్థకి పట్టుకొమ్మ అయిన వ్యవసాయ రంగంలో మాత్రం ఇందుకు భిన్నంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉపాధి పొందినవారి సంఖ్య పెరిగింది. అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులంతా నగరాల్లో పనులు కోల్పోవడంతో వ్యవసాయ పనుల్లోకి వెళ్లడం సహజమని సీఎంఐఈ చెబుతోంది.
 
అయితే, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే భారాన్ని భారత ప్రభుత్వం ప్రజలపై మోపక తప్పదని సీఎంఐఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ బీబీసీకి చెప్పారు. కోవిడ్-19 కేసులు తక్కువగా నమోదైన ప్రాంతాలలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్ని సడలించే ప్రయత్నాలు చేస్తోంది. జోన్ల ప్రాతిపదికన లాక్ డౌన్ సడలింపు ప్రారంభించడం మంచిదే కానీ, ఇది దీర్ఘ కాలంలో ఉపయోగపడదని వ్యాస్ అన్నారు.
 
“ప్రాంతాలు వేటికవే ఒంటరిగా పని చేయలేవు. ప్రజలు, వస్తువులు, సేవలు ఒక చోట నుంచి మరొక చోటుకి వెళ్లగలిగే సౌలభ్యం ఉండాలి. వ్యాపారాలు పూర్తిగా నష్టపోక ముందే సరఫరా వ్యవస్థ తిరిగి ప్రారంభం కావాలి” అని ఆయన అన్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 17తో ముగుస్తుండగా కొన్ని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్‌ను పొడిగించాయి. దేశంలో లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు.
 
ఇప్పటికే దేశంలో నెలకొన్న నిరుద్యోగ పరిస్థితిపై నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 2017 జులైలో 3.4 శాతం ఉన్న నిరుద్యోగ రేటు మార్చి నాటికి 8.7 శాతానికి చేరింది. ఇది గత 43 నెలల్లో అత్యధికమని సీఎంఐఈ చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు