పాకిస్తాన్‌: రైలులో అగ్నిప్రమాదం, 60 మంది ప్రయాణికుల మృతి

గురువారం, 31 అక్టోబరు 2019 (12:14 IST)
పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న ఓ రైలు మంటల్లో చిక్కుకోవడంతో 60 మంది ప్రయాణికులు మరణించారు. కరాచీ నుంచి రావల్పిండికి ప్రయాణించే తేజ్ గామ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. వంట చేసుకునేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక మీడియా చెబుతోంది. దీంతో, కనీసం 3 బోగీలకు మంటలు వ్యాపించాయి.

 
మంటల్లో కాలిపోతున్న రైలు నుంచి బయటకు దూకే క్రమంలో చాలా మంది ప్రయాణికులు మరణించారని అధికారులు చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. మరో 30మంది గాయాలపాలయ్యారని అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని వారు భావిస్తున్నారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని రహీమ్ యార్ ఖాన్ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

 
ఇమ్రాన్ ఖాన్ సంతాపం
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖఆన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారని, బాధితులకు తక్షణమే పూర్తి వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారని రేడియో పాకిస్తాన్ తెలిపింది.

 
రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రయాణికులు, రైలుకు బీమా ఉందని, నష్టానికి పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపడతామని అన్నారు. "చనిపోయిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైలు పట్టాలు తప్పలేదు కాబట్టి ఒక గంటలో దాన్ని లియాఖత్‌పూర్ జంక్షన్‌కు తరలిస్తాం" అని మంత్రి తెలిపారు.

 
ప్రమాదం జరిగిన తర్వాత ఈ మార్గంలో నడిచే అనేక రైలు సర్వీసులు రద్దయ్యాయి. కానీ ఇప్పుడు అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. "మంటలు అదుపులోకి వచ్చాయి. మూడు బోగీలు దగ్ధమయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించాం" అని మంత్రి వెల్లడించారు.

 
లాహోర్‌కు వెళ్తున్న ప్రయాణికుల్లో కొందరు సిలిండర్లు, వంటసామగ్రి, స్టౌలు తెచ్చుకోవడం, వాటిని ఉపయోగించి వంటచేసుకోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు