మోడీ పాలనలో కార్పొరేటర్లకు రూ.6 లక్ష కోట్ల పన్నుల మినహాయింపు!

బుధవారం, 10 మార్చి 2021 (08:36 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలోని కార్పోరేటర్లు సుభిక్షంగా ఉన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింలు లభిస్తున్నాయి. ఫలితంగా దేశంలోని పెట్టుబడిదారులంతా సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి నిదర్శనమే గత ఆరేళ్ళ కాలంలో ఏకంగా 6 లక్షల కోట్లకు పైగా పన్నులు మినహాయించినట్టు కేంద్రం వెల్లడించింది. 
 
గత ఆరేళ్ళ కాలంలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
 
ఇందులో 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.1,15,176.50 కోట్లు, 2016-17లో రూ.1,30,184.41 కోట్లు, 2017-18లో రూ.1,20,069.67 కోట్లు, 2018-19లో రూ.1,25,891.78 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
 
అయితే, ఆదాయ పన్ను చట్టం-1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వివరించారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు