జేఈఈ మెయిన్స్ : అదరగొట్టిన తెలుగు విద్యార్థులు...

ఠాగూర్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (15:06 IST)
జేఈఈ మెయిన్స్ సెషన్-1 2024 పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం రిలీజ్ చేసింది. ఈ పరీక్షా ఫలితాల్లో 23 మంది విద్యార్థులు వంద శాతం మార్కులతో అదరగొట్టారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పది మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎన్.టి.ఏ విడుదల చైసిన మొదటి పేపర్ బీఈ, బీటెక్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. ఇందులో 10 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉండటం గమనార్హం. వీరిలో తెలంగాణాకు చెందిన రిషి శేఖర్ శుక్లా, పబ్బ రోహన్ సాయి, ముతవరకు అనూప్, హుందేకర్ విదిత్, మదినేని వెంకట సాయి తేజ, కల్లూరి శ్రియాషస్ మోహన్, తవ్వ దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనీశ్ రెడ్డిలు వంద శాతం స్కోరును సాధించారు. 
 
కాగా, గత నెల 24వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్స్ తొలి విడత పేపర్-1 పరీక్షలు దేశ వ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 11,70,036 మంది విద్యార్థులు హాజరుకాగా, ఆ ఫలితాలను మంగళవారం వెల్లడించారు. చివరి విడత సెషన్ ఏప్రిల్ 4వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య నిర్వహించనున్నట్టు ఎన్.టి.ఏ వెల్లడించింది. తొలి విడత రాసిన విద్యార్థులు, రెండో విడుతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండింటిలో ఉత్తమ స్కోర్‌ (రెండు విడతలు రాస్తే)ను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు