భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా : ఐసీఎంఆర్

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (10:28 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ ప్రజలు భయంతో వణిపోయారు. ఈ వైరస్ సోకి అనేక మంది ప్రాణాలు కోల్పోగా, ఇంకొందరు కోలుకున్నారు. అలా భారత్‌లో ఈ వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో భారత్‌లో గత సంవత్సరం డిసెంబర్ నాటికే ప్రతి ఐదుగురిలో ఒకరికి పైగా కరోనా బారిన పడ్డారని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నిర్వహించిన సీరోలాజికల్ సర్వే గణాంకాలు వెల్లడించాయి. 
 
ఢిల్లీ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో సీరో సర్వే నిర్వహించగా, 21.4 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయి, యాంటీ బాడీలు వృద్ధి చెందాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. 10 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిలో 25.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని పేర్కొంది. 
 
ఈ గణాంకాల ఆధారంగా ప్రతి ఐదుగురిలో ఒకరికి కరోనా వైరస్ సోకిందన్న నిర్ధారణకు వచ్చామని అన్నారు. ఆగస్టులో జరిపిన సర్వేతో పోలిస్తే, కరోనాను ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని కలిగివున్న వారి సంఖ్య 0.7 శాతం నుంచి 21.4 శాతానికి పెరిగిందని తెలిపారు. 
 
ఇక 18 సంవత్సరాల కన్నా అధిక వయసున్న వారిలో 21.4 శాతం, టీనేజ్ లో ఉన్న వారిలో 25.3 శాతం, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో ఉంటున్న వారిలో 31.7 శాతం, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 26.2 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతం వరకూ కరోనా రోగ నిరోధక శక్తి ఉందని తమ సర్వేలో తేలిందని రాజేశ్ భూషణ్ తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు