కరోనాను జయించిన శతాధిక వృద్ధులు... ఎక్కడ?

గురువారం, 16 జులై 2020 (10:25 IST)
కరోనా వైరస్ బారినపడితే ఇక అంతే సంగతులు అనే ప్రచారం సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. అనారోగ్యంతో బాధపడే అనేక మంది యువకులు ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు. దీంతో ఈ వైరస్ సోకితే ఇక ప్రాణాలు కోల్పోవాల్సిందేననే ప్రచారం సాగుతోంది. అయితే, ఆ ఇద్దరు శతాధిక వృద్ధులు మాత్రం కరోనా మహమ్మారి నుంచి జయించారు. వారిలో ఒకరి వయసు 101 యేళ్లు కాగా, మరొకరి వయసు 103 యేళ్లు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కరోనా బారినపడిన వందేళ్ల వ్యక్తి కోలుకోవడమే కాకుండా 101వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న మహారాష్ట్రలో జరిగింది. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైరైన అర్జున్ గోవింద్‌కు నూరు సంవత్సరాలు. 
 
ఇటీవల ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 1వ తేదీన ముంబైలోని బాలాసాహెబ్ థాకరే ట్రామా కేర్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నిర్వహించిన కరోనా పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అక్కడే గత రెండువారాలుగా చికిత్స పొందుతున్నారు.
 
ఆయన పూర్తిగా కోలుకోవడంతో నిన్న రాత్రి డిశ్చార్జ్ చేయాలని ఆసుపత్రి వైద్యులు భావించారు. అయితే, నిన్ననే ఆయన 101వ వసంతంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిన సిబ్బంది, వైద్యులు ఆసుపత్రిలోనే బర్త్ డే వేడుకలు నిర్వహించారు. 
 
వేడుకల్లో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, 15 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విద్యా మాన్యే అన్నారు.
 
మరోవైపు, తమిళనాడులో 103 ఏళ్ల వృద్ధురాలు కరోనా మహమ్మారిని జయించింది. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఈ బామ్మ  విజయవంతంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యింది. వేలూరు జిల్లా అంబూర్‌ సమీపంలోని పెరియవరిక్కం పరిధిలోని ఓ ప్రాంతంలో హమీదాబీ (103), తన కుమార్తె(58)తో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
 
వీరికి ఈనెల ఒకటో తేదీన అనారోగ్యానికి గురికావడంతో ఆరోగ్య సిబ్బంది వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.  చికిత్స నిమిత్తం అంబూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. బామ్మ కోలుకోవడంతో  వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. వృద్ధురాలికి కరోనా వైరస్‌ సోకడంతో వారిని ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి ఓనర్‌తో పాటు చుట్టుపక్కల వారు బెదిరిస్తున్నాడని బాధితురాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. 
 
రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ గాయత్రి సుబ్రమణి నేతృత్వంలోని అధికారుల బృందం బాధితురాలి ఇంటిని సందర్శించింది. బామ్మ ఆధార్‌ కార్డును పోగొట్టుకుందని, ఆమె వయసు నిర్ధారణకు సరైన పత్రాలు లేవని అధికారులు చెప్పారు. వృద్ధురాలికి పెన్షన్‌ మంజూరయ్యేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఆమె ఇంటిని సందర్శించిన ప్రతిసారి ఆమెకు పండ్లు అందజేస్తున్నామని అధికారులు చెప్పారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు