కరోనా బాధితులు లేరా? ఏం... తమాషాలు చేస్తున్నారా? కేంద్రం సీరియస్

సోమవారం, 16 మార్చి 2020 (18:16 IST)
కరోనా వైరెస్-స్థితి
మన దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా పాకుతోందన్నది మెల్లమెల్లగా పెరుగుతున్న కరోనా వైరస్ బాధితుల సంఖ్యను బట్టి అర్థమవుతోంది. ఐతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైరస్‌ను సీరియస్‌గా తీసుకోవడంలేదు.

కనీసం వైరస్ సంబంధించి హెచ్చరికలు, టీవీల ద్వారా ప్రకటనలు, ఇతరత్రా మార్గాల ద్వారా అప్రమత్తం చేయడం వంటివి అస్సలు చేయడంలేదు. దీనితో అసలు మన దేశంలో వున్న కరోనా బాధితుల సంఖ్య లెక్కల్లో చూపినట్లుగా వున్నాయా.. లేదంటే లెక్కతేలకుండానే వ్యాపిస్తూ వెళ్లిపోతోందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
 
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏకంగా 23కి పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ పొరుగునే వున్న తమిళనాడులో ఒక్కటంటే ఒక్క కేసు మాత్రమే నమోదైంది. పైగా అది కూడా కరోనా వైరస్ సంబంధమైనది కాదంటూ అక్కడి ఆరోగ్య శాఖ అధికారి బుకాయించడం కొసమెరుపు.

అలాగే తెలుగు రాష్ట్రాలకు పొరుగునే వున్న కర్నాటక, మహారాష్ట్రల్లో కరోనా వైరస్ కలవరం పెడుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసులు వేళ్లమీద లెక్కించుకోవచ్చు. ఏపీలో 1 కేసు నమోదు కాగా పొరుగునే వున్న కర్నాటకలో 6 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రంలో 33 కేసులు నమోదవగా పక్కనే వున్న తెలంగాణలో 3 కేసులు నమోదయ్యాయి.
 
కేరళలో 23 కేసులు నమోదవగా ఆ రాష్ట్రానికి ఆనుకుని వున్న తమిళనాడులో ఒక్కటంటే ఒక్క కేసు నమోదైంది. ఈ గణాంకాలను చూచిన కేంద్రం తమిళనాడు ఆరోగ్యశాఖపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు రోగులను సరిగా పరీక్షిస్తున్నారా... నిర్థారణ చేస్తున్నారా... రాష్ట్రంలో ఒక్క కేసు మినహా అనుమానితులు ఎక్కడా కనిపించడం లేదా. ప్రజల జీవితాలతో తమాషాలాడుతున్నారా? ఇప్పటికైనా సత్వరమే చర్యలు తీసుకుని ప్రతి ఏరియా ఆసుపత్రి పరిధిల్లో తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు