దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. అలాగే, తెలంగాణా రాష్ట్రంలో కూడా అనేక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై పాన్, తంబాకును నమిలి ఉమ్మివేయడం నిషేధం.
ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మివేయడం, శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు.
బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయడం ద్వారా అంటువ్యాధులు వ్యాపించే తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రహదారుల మీద ఉమ్మివేసే వాహనదారులను ఆటోమెటిక్ వెహికిల్ రికగ్నిషన్ సిస్టం (ఏవీఆర్ఎస్) ద్వారా గుర్తించి.. వారిపై చర్యలు తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరించనున్నారు.