పోస్ట్ కరోనా తర్వాత సరికొత్త రోగం.. ఆహారం కంపు కొట్టినట్టు అనిపిస్తే...

ఆదివారం, 20 జూన్ 2021 (09:13 IST)
చాలా మంది కరోనా బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాలైన వ్యాధులకు గురవుతారు. ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్, స్కిన్ ఫంగస్ ఇలా అనేక రకాలైన జబ్బులబారినపడుతున్నారు. తాజాగా మరో సమస్య పోస్ట్ కరోనా బాధితుల్లో కనిపిస్తోంది. 
 
కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఏ ఆహారం ముట్టుకున్నా కంపుకొడుతున్నట్టు అనిపిస్తే మాత్రం పార్మోసియా బారినపడినట్టుగా భావించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత చాలామంది బాధితులు రుచి, వాసనను కోల్పోవడంతోపాటు కొన్ని వింత సమస్యలను ఎదుర్కొంటున్నారని, అలాంటి వాటిలో ఆహారం కంపు కొట్టినట్టు అనిపించడం కూడా ఒకటని అంటున్నారు.
 
జలుబు, లేదంటే వైరస్ కూడా పార్మోసియాకు ఓ కారణమని వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)కి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ అజయ్ నాథ్ మిశ్రా పేర్కొన్నారు. దీని బారినపడినవారిలో ఘ్రాణ శక్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. 
 
శ్వాస ఎగువ భాగంలో వైరస్ సంక్రమణ కారణంగా ఘ్రాణ న్యూరాన్లు దెబ్బతింటాయని వివరించారు. వృద్ధుల్లోను, పొగతాగే వారిలోను ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని, బాధితులు క్రమంగా ఈ సమస్య నుంచి బయటపడతారని ప్రొఫెసర్ అజయ్‌నాథ్ మిశ్రా పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు