తెలుగు రాష్ట్రాల్లో పది శాతం కరోనా టీకాల వృథా : కేంద్రం ఆందోళన

గురువారం, 18 మార్చి 2021 (15:04 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రెండో దశగా భావిస్తున్నారు. అదేసమయంలో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా సాగుతోంది. అయినప్పటికీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో టీకా కార్యక్రమంలో వేగం, విస్తృతిని పెంచి, వైరస్‌ వ్యాప్తికి అడ్డకట్ట వేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో 45 ఏళ్లు పైబడిన వారందరిని చేర్చాలని యోచిస్తోంది. 
 
ఇప్పటివరకు రెండు దశల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, 60 ఏళ్లు పైబడిన (45 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన) వారికి కేంద్రం టీకాలు పంపిణీ చేసింది. అయితే, ఈ పరిధిని విస్తృతం చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను పలు రాష్ట్రాలు అభ్యర్థిస్తున్నాయి. 
 
ఇదే అంశంపై ఐసీఎంఆర్ ఉన్నతాధికారి సిమ్రన్ ఒకరు మాట్లాడుతూ, '45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు అందించే విషయం పరిశీలనలో ఉంది. క్రమంగా ప్రభుత్వం అన్ని వర్గాల వారికి టీకాలు అందించాలి. అయితే, ప్రస్తుతం కొవిడ్ విజృంభిస్తుండటంతో.. అధిక సంఖ్యలో ప్రజలకు టీకాలు అందించి, వారికి రక్షణ కల్పించాల్సి ఉంది. ప్రస్తుత ప్రక్రియ ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటాం' అని ఆయన తెలిపారు. 
 
ఇకపోతే, దేశంలో టీకాలు అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు. అదేసమయంలో టీకాల వృథా కూడా ఎక్కువగానేవుంది. దీనిపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు కూడా. కేంద్రం ఇప్పటివరకు 75.4 మిలియన్ల డోసుల టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసింది. దాంట్లో 6.5 శాతం వృథా అయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లోని వృథా దేశ సగటును మించి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 10 శాతానికి పైగా టీకా వృథా అవుతోందని స్వయంగా ప్రధానే ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఇది ఇతర వయసు వర్గాలను కూడా టీకా కార్యక్రమంలో చేర్చాలనే డిమాండ్లకు ఊతం ఇస్తోంది. అలాగే వృథా ఎంత తక్కువగా ఉంటే..అంత ఎక్కువ మందికి టీకాలు అందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు