పతంజలి కరోనిల్.. వివరణ ఇచ్చిన ఆచార్య బాలకృష్ణ

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (19:07 IST)
కరోనా నేపథ్యంలో గతేడాది పతంజలి గ్రూప్ కరోనిల్ పేరిట ఓ ట్యాబ్లెట్‌ను రూపొందించి మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సరైన పరిశోధన చేయకుండా మార్కెట్‌లోకి అలా ఎలా విడుదల చేస్తారు ? అని చెప్పి ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రశ్నించగా.. పతంజలి సంస్థ కరోనిల్‌ను వెనక్కి తీసుకుంది. తరువాత ఆ ట్యాబ్లెట్లను రోగ నిరోధక శక్తి పెంచే ట్యాబ్లెట్లుగా పతంజలి మార్చి వాటిని విక్రయించింది.
 
అయితే ఇటీవలే ఆయుష్ మంత్రిత్వ శాఖ మళ్లీ ఆ ట్యాబ్లెట్ కోవిడ్‌కు పనిచేస్తుందని, కోవిడ్ లక్షణాలను తగ్గిస్తుందని ధ్రువీకరించింది. దీంతో కరోనిల్‌ను మళ్లీ మార్కెట్‌లోకి పతంజలి సంస్థ రీ లాంచ్ చేసింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనిల్ ట్యాబ్లెట్‌ను కోవిడ్ చికిత్సకు అనుమతించిందని చెబుతూ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అదేమి లేదని, వట్టి పుకారేనని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇటు పతంజలి కూడా ఆ వార్తలను కొట్టి పారేశాయి.
 
కరోనిల్ ట్యాబ్లెట్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరణ లభించిందని చెబుతూ వచ్చిన వార్తలపై ఆ సంస్థ స్పందించింది. తాము కరోనిల్ ట్యాబ్లెట్‌కు అనుమతి ఇవ్వలేదని, అసలు ఆ ట్యాబ్లెట్ పనితీరును కూడా ఇప్పటి వరకు పరిశీలించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేసింది. 
 
అలాగే పతంజలి గ్రూప్ ఎండీ ఆచార్య బాలకృష్ణ స్పందిస్తూ.. కరోనిల్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు లభించిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తమ ట్యాబ్లెట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించలేదని, అలాగే దాన్ని తిరస్కరించలేదని.. ఆయన ట్వీట్ చేశారు.
 
కోవిడ్-19కి సంబంధించి తాము ఎలాంటి సంప్రదాయకమైన ఔషధాన్ని పరిశీలనలోకి తీసుకోలేదని, ధ్రువీకరించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్వీట్ చేయడంతో పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ అభివృద్ధి చేసిన 'కరోనిల్‌' వ్యాక్సిన్‌ మరోసారి వివాదంలో చిక్కుకుంది. కరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిందంటూ పతంజలి తప్పుదారి పట్టించిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. 
 
దీనిపై పతంజలి సంస్థకు చెందిన ఆచార్య బాలకృష్ణ తాజాగా వివరణ ఇచ్చారు. కరోనిల్‌కు డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ కాంప్లియంట్ సీఓపీపీ సర్టిఫికేట్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జారీ చేసిందని, డబ్ల్యూహెచ్ఓ కాదని తెలిపింది.
 
'ప్రస్తుత గందరగోళంపై మేము వివరణ ఇవ్వాలనుకుంటున్నాం. కరోనిల్‌కు జీఎంపీ కాంప్లియంట్ సీఓపీపీ సర్టిఫికెట్‌ను భారత ప్రభుత్వానికి చెందిన డీసీజీఐ ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఏ ఏ డ్రగ్‌ను ఆమోదించడం కానీ, ఆమోదించకపోవడం కానీ ఉండదు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మెరుగైన, ఆరోగ్యకరమైన భవిష్యత్‌ అందించే దిశగా డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తుంది' అని ఆచార్య బాలకృష్ణ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ జీఎంపీ క్వాలిటీ అప్రూవల్స్‌కు అనుగుణంగానే సీపీపీ లైసెన్స్ జారీ అయిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు