జస్ట్ 24 గంటల్లో 112 మంది పోలీసులకు కరోనా .. వణికిపోతున్న ఖాకీలు!

మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:47 IST)
కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్ర పోలీసులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే వేల మంది పోలీసులు ఈ వైరస్ బారినపడ్డారు. వీరిలో పలువురు వందల మంది చనిపోయారు. దీంతో పోలీస్ శాఖలో కరోనా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 112 మందికి ఈ వైరస్ సోకినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
పోలీస్‌శాఖలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 12,495కు చేరింది. మంగళవారం వరకు 10,111 మంది పోలీసులు కోలుకున్నారు. ప్రస్తుతం 2,256 మంది సిబ్బంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. 
 
24 గంటల్లో మరో ఇద్దరు మృతి చెందడంతో కరోనాతో మరణించిన పోలీసుల సంఖ్య 128కి పెరిగింది. సోమవారం మహారాష్ట్రలో కొత్తగా 8,493 కరోనా కేసులు నమోదు కాగా 228 చనిపోయారు. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,04,358కు పెరిగింది. 
 
ఇదిలావుండగా, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో 24 గంటల్లో 55,079 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 876 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 27,02,743కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 51,797కి పెరిగింది. ఇక 6,73,166 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 19,77,780 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటివరకు మొత్తం 3,09,41,264 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులోనే 8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు