లాక్డౌన్ ఎఫెక్టు... ఊపిరి పీల్చుకున్న ముంబై... కొత్త కేసులు 4 వేలే

సోమవారం, 3 మే 2021 (08:52 IST)
గత కొన్ని రోజలుగా ముంబై మహానగరాన్ని వణికించిన కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి లాక్డౌన్ పుణ్యమాన్ని కాస్త శాంతించింది. నగరంలో లాక్డౌన్‌ను కఠినంగా అమలు చేస్తుండటంతో, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఆదివారం ముంబైలో కొత్తగా 3,629 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 73 మంది మహమ్మారి కారణంగా కన్నుమూశారు.
 
ఇప్పటివరకూ ముంబైలో 6.55 లక్షల మందికిపైగా కరోనా సోకగా, 13 వేల మందికిపైగా మరణించారు. మొత్తం మహారాష్ట్రలో 47.22 లక్షలకుపైగా కేసులు రాగా, 70 వేల మందికిపైగా చనిపోయారు. 
 
ఇక, ఆదివారం కరోనా నుంచి 51,356 మంది కోలుకోవడంతో, ఆసుపత్రుల్లో సైతం వేలాది బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. రికవరీ రేటు 84.31 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
 
ప్రస్తుతం మహారాష్ట్రలో 6.68 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇక, కరోనా టీకాలను ప్రస్తుతానికి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికే ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్న బీఎంసీ అధికారులు, 45 ఏళ్లు పైబడిన వారు టీకాల కోసం రావద్దని సూచించారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా మహారాష్ట్రను కరోనా వైరస్ కుదిపేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, పూణె, నాగ్‌పూర్, అమరవాతి వంటి పట్టణాల ప్రజలు కరోనా వైరస్ దెబ్బకు వణికిపోయారు. దేశంలోనే నమోదయ్యే కరోనా కేసుల్లో 50 శాతం కేసులు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతూ వచ్చాయి. దీంతో కఠిన ఆంక్షలతో లాక్డౌన్‌ను అమలు చేయడంతో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు