తెలంగాణలో మరోసారి లాక్డౌన్.. మే 14వరకు పాస్ పోర్ట్ సేవలు నిలిపివేత

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (20:15 IST)
తెలంగాణలో గత వారంరోజులుగా భారీగా పాజిటివ్ కేసులు నమోదుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హోం సెక్రటరీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు కమిషనర్ల ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. 
 
ఈ నెల 30 తరువాత లాక్‌డౌన్ పెట్టె యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వానికి రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ నివేదిక సమర్పించింది. అంతేకాకుండా లాక్‌డౌన్‌పై హోమ్ శాఖకు ప్రతిపాదనలు చేరినట్లు సమాచారం. మరోవైపు లాక్‌డౌన్ వదంతులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిలో పడింది. మరోసారి లాక్‌డౌన్ పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయేనని సమాన్యులు భయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపటి నుంచి వచ్చేనెల 14 వరకు పాస్‌పోస్టు సేవలు నిలిచిపోనున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం పాస్‌పోర్టు సేవలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 14 తపాలా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పాస్‌పోస్టు సేవలను అందిస్తుంది. తాజా నిర్ణయంతో ఇవన్ని గురువారం నుంచి మూతపడనున్నాయి.
 
ఈ విషయాన్ని గమనించి దరఖాస్తు దారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మే 14 తరువాత పరిస్థితులకు అనుగుణంగా పాస్‌పోర్టు సేవాలను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు