పాజిటివ్ వస్తే రోగికి 14 రోజుల పాటు భోజనం, ఆదుకుంటున్న 'సెవెన్ హిల్స్' అపార్ట్‌మెంట్ స్త్రీమూర్తులు

శుక్రవారం, 21 మే 2021 (17:36 IST)
కరోనా అంటే భయపడే పరిస్థితి. అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో.. ఈరోజు చూసిన వారు రేపు ఉంటారో లేదోనన్న అనుమానం. కరోనా సోకితే అంతటి భయం. కరోనా సోకిన వారికి సేవ చేసేందుకు సొంత కుటుంబ సభ్యులే ముందుకు రాని పరిస్థితి. ఇక చనిపోతేనా అస్సలు ఆ వైపు కూడా రారు.
 
కానీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో కనీసం బెడ్ సౌకర్యం లేకపోవడంతో చాలామంది హోంఐసోలేషన్లో ఉంటున్నారు. అలాంటి వారు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి. నీరసంతో ఇంట్లో వంటలు కూడా చేసుకోలేరు. అలా నిస్సహాయ స్థితిలో వున్న వారి ఇళ్ళకే నేరుగా భోజనాన్ని అందిస్తున్నారు తిరుపతికి చెందిన ఒక అపార్టుమెంటు వాసులు. 
 
కరోనాతో హోంఐసోలేషన్లో ఉన్న రోగులను ఆదుకుంటున్నారు తిరుపతికి చెందిన విద్యానగర్ కాలనీ వాసులు. సెవెన్ హిల్స్ అపార్టుమెంటులో కొంతమంది కలిసికట్టుగా మొత్తం వ్యయాన్ని భరిస్తూ హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు ప్రతిరోజు మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భోజనాన్ని అందజేస్తున్నారు. గత నెల రోజుల నుంచి మహాయజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 
 
మొదట్లో 29 మంది కరోనా రోగులకు భోజనాన్ని అందించడం మొదలుపెట్టి ఇప్పుడు 250 మంది దాకా కరోనా రోగులకు ఉచితంగా భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. పాజిటివ్ వచ్చినట్లు రిపోర్ట్‌ను వాట్సాప్ ద్వారా పంపితే 14 రోజుల పాటు ఇంటికే భోజనాన్ని తీసుకెళ్ళి అందజేస్తున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా సెవెన్ హిల్స్ అపార్టుమెంటులోని కొంతమంది మహిళలు కలిసికట్టుగా కరోనా రోగులకు తమ వంతు సాయం చేస్తున్నారు. 
 
కరోనాతో నీరసించిపోయి వంట కూడా చేసుకోలేక, ఆసుపత్రులలో బెడ్ సౌకర్యం లేక హోంఐసోలేషన్లో ఉండేవారి కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే తామందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఆ స్త్రీమూర్తులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు