#AmbatiRambabuకు రెండోసారి కరోనా పాజిటివ్.. మహమ్మారి రూటు మార్చేసిందా?

సోమవారం, 7 డిశెంబరు 2020 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం వైరస్ రూటుమార్చడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఒకసారి కరోనా సోకితే మళ్లీ వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు. కానీ, కరోనా మహమ్మారి రెండోసారి కూడా పంజా విసురుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండోసారి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
 
జూలైలో తనకు కోవిడ్ వచ్చి తగ్గిందని.. అయితే అసెంబ్లీ కోవిడ్ టెస్టు చేయించడంతో.. రిపోర్ట్స్‌లో పాజిటివ్ వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్‌ను మరోసారి జయించి మీ ముందుకి వస్తాను అంటూ.. అంబటి రాంబాబు పేర్కొన్నారు.
 
కాగా, ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు కూడా రెండోసారి కరోనా వచ్చింది. దీంతో ఆయన శాసనమండలి సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబుకు సైతం రెండోసారి కరోనా సోకింది. కరోనా మహమ్మారి ప్రజలపై ఇలా వరుసగా దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు