రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డులు.. ఆరోన్ జోన్స్ రికార్డు మాయం!!

వరుణ్

మంగళవారం, 25 జూన్ 2024 (09:39 IST)
అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీని పూర్తి చేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. అదే ఊపును కొనసాగించిన రోహిత్ 41 బంతుల్లో 92 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అంతేకాకుండా, అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 
 
పైపెచ్చు, ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ నుంచి రోహిత్ శర్మ అధికంగా ఎనిమిది సిక్సర్లు బాదాడు. ఆ తర్వాతి స్థానంలో యువరాజ్ సింగ్ ఏడు సిక్సర్లు బాది రెండో స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా, ఒకే జట్టు ముఖ్యంగా, ఆస్ట్రేలియాపై టీ20ల్లో ఎక్కువ సిక్సర్లు అంటే 132 బాదిన బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. అలాగే, ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు 92 సాధించిన రెండో కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. మొదటి స్థానంలో వెస్టిండీస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ 98 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. 
 
ఇదిలావుంటే, సోమవారం రాత్రి ఆస్ట్రేలియాతో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాదించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్‌ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టేశాడు. ఆరోన్ జోన్స్ 22 బంతుల్లోనే 50 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇపుడారికార్డు తెరమరుగైంది. కాగా, సోమవారం నాటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ప్రధాన బౌలర్ మిచెల్ స్టార్క్ పనిబట్టాడు. స్టార్క్ విసిరిన ఒక ఓవర్‌లో రోహిత్ శర్మ ఏకంగా నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదేశాడు. ఈ ఓవర్‌లో వైడ్‌‍తో కలుపుకుని ఏకంగా 29 పరుగులు వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు