సౌతాఫ్రికా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ : వన్డే మ్యాచ్ వాయిదా

శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:22 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం గడగడలాడిపోతోంది. ఈ వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ ఎన్నో జాగ్రత్తల మధ్య నిర్వహించాల్సివుంది. అయినప్పటికీ.. ఆటగాళ్లు చేసే చిన్నపొరపాట్ల వల్ల కరోనా వైరస్ బారినపడుతున్నారు. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు చెందిన ఓ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన వన్డే మ్యాచ్‌ను రద్దు చేశారు. 
 
కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే చిన్న తప్పిదాలతో ఆటగాళ్లు కూడా కరోనా బారినపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. 
 
నిజానికి ఇంగ్లండ్ - సౌతాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం జరగాల్సివుంది. కానీ, ఈ వన్డే మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో సౌతాఫ్రికా జట్టులోని ఓ ఆటగాడు కరోనా బారినపడినట్టు తేలింది. అయితే, ఆ ఆటగాడి పేరును మాత్రం వెల్లడించలేదు. 
 
దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమాచారం అందించింది. అనంతరం తొలి వన్డేను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేయాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి.
 
రెండు జట్లలోని ఆటగాళ్లు, అంపైర్లు, మ్యాచ్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వాయిదా వేసినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈఓ కుగాండ్రీ గోవెందర్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు