కొత్త సంవత్సరంలో బిజీబిజీగా గడపనున్న టీమిండియా

సోమవారం, 1 జనవరి 2024 (10:46 IST)
కొత్త సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు బిజీబిజీగా గడపనుంది. ప్రపంచ కప్ ఫైనల్‌ పోటీలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియా ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. అయితే, ఈ యేడాది జరుగనున్న టీ20 ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించి కప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది. అలాగే, 2024లో భారత క్రికెట్ జట్టు పలు క్రికెట్ స్వదేశీ, విదేశీ సిరీస్‌లతో బిజీబిజీగా గడపనుంది. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు దక్షిణాఫ్రికాతో కేప్టాన్ రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 11 నుంచి ఆఫ్ఘనిస్థాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. 11వ తేదీన మొహాలీలో తొలి మ్యాచ్ జరగనుండగా 14న ఇండోర్‌లో, 17న బెంగళూరులో రెండు, మూడు టీ20లు జరుగుతాయి. ఇదే నెలలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించి 5 టెస్టులు ఆడుతుంది. 
 
జనవరి 25 నుంచి 29 వరకు జరగనున్న తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండగా, ఫిబ్రవరి 2-6 మధ్య విశాఖపట్టణంలో రెండో టెస్టు, 15-19 మధ్య రాజ్‌కోట్‌ మూడో టెస్టు జరుగుతుంది. 23 నుంచి 27 వరకు జరగనున్న నాలుగో టెస్టుకు రాంచీ, మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్న ఐదో టెస్టుకు ధర్మశాల ఆతిథ్యమిస్తాయి.
 
ఏప్రిల్-మే మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌కు విరామం లభించనుంది. ఆ తర్వాత జూన్‌‍లో జరగనున్న టీ20 ప్రపంచకప్కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిస్తాయి. జులైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. 
 
ఈ సందర్భంగా మూడు వన్డేలు, అంతే సంఖ్యలో టీ20లు ఆడుతుంది. సెప్టెంబరులో బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించి రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడుతుంది. అక్టోబరులో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌లో మూడు టెస్టులు ఆడుతుంది. నవంబర్, డిసెంబరులో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించి ఐదు టెస్టులు ఆడుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు