ఐదో వన్డే మ్యాచ్ : వెస్టిండీస్ చిత్తు.. కోహ్లీ సేనదే సిరీస్

గురువారం, 1 నవంబరు 2018 (17:24 IST)
పర్యాటక వెస్టిండీస్ జట్టుతో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో భారత్ సొంతం చేసుకుంది. 
 
గురువారం తిరువనంతపురంలో జరిగిన ఐదో వన్డేలో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ 31.5 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ రవీంద్ర జడేజా దెబ్బకు విండీస్ బ్యాటింగ్ పేక మేడలా కుప్పకూలింది. భారత బౌలర్లు సంధించిన బంతులను ఎదుర్కోలేక విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 
 
విండీస్ ఆటగాళ్లలో కెప్టెన్ జాసన్ హోల్డర్ చేసిన 25 పరుగులే అత్యధికం. రోవ్‌మన్ పావెల్ 16, మార్లన్ శామ్యూల్స్ 24 పరుగులు చేశారు. మిగతా వారెవరూ పట్టుమని 10 పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, ఖలీల్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 
 
ఆ తర్వాత 106 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ సేన.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టానికి లక్ష్యాన్ని అధికమించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 6 పరుగులకే ఔట్ కాగా, రోహిత్ శర్మ మరోమారు రెచ్చిపోయి ఆడాడు. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. మొత్తం 56 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 33 పరుగులు చేశాడు. ఫలితంగా కోహ్లీ సేన 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు