ఐపీఎల్ వేలం పాటలు : మిచెల్ స్టార్క్ ధర రూ.24.75 కోట్లు

మంగళవారం, 19 డిశెంబరు 2023 (16:15 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పాటలు మంగళవారం దుబాయ్ వేదికగా సాగుతున్నాయి. ఈ పాటల్లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో హీరోలుగా నిలిచిన ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు వేలం పాటల్లో ఆల్‌టైమ్ రికార్డు ధర ఫలికారు. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ ఏకంగా రూ.24.75 కోట్ల ధర పలకగా, మరో ఆటగాడు ప్యాట్ కమిన్స్ రూ.20.5 కోట్ల ధరకు అమ్ముడుపోయాయి. ఈ ఆటగాడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ దక్కించుకుంది. మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు దక్కించుకుంది. 
 
అలాగే, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిచెల్‌ను రూ.14 కోట్లు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్‌ సొంతం చేసుకుంది. భారత పేసర్‌ హర్షల్‌ పటేల్‌ను రూ.11.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో సెంచరీ సాధించి ఆసీస్‌ను గెలిపించిన ట్రావిస్ హెడ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ రూ.6.8 కోట్లకు దక్కించుకుంది. ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను కూడా రూ.1.5 కోట్లకు తీసుకుంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ను రూ.4.2 కోట్లు పెట్టి పంజాబ్‌ దక్కించుకుంది. శార్దూల్‌ను (రూ. 4 కోట్లు), రచిన్‌ రవీంద్ర (రూ.1.50 కోట్లు) చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేలంలో సొంతం చేసుకుంది. 
 
అలాగే, ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్‌ను గత యేడాది మినీ వేలంలో సన్ రైజర్స్ జట్టు ఏకంగా రూ.13.25 కోట్లు చెల్లించి దక్కించుకుంది. కానీ గత సీజన్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో భారీ ధర పలుకుతాడని భావించినా.. అతడికి అంత సీన్ లేదని ఫ్రాంచైజీలు తేల్చేశాయి. తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.4 కోట్లకే దక్కించుకుంది. గత యేడాది ధరతో పోల్చితే బ్రూక్ ఏకంగా రూ.9.25 కోట్లు కోల్పోయాడు. గత సీజన్‌లో బ్రూక్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు