అథ్లెటిక్స్ లెజెండ్ మిల్కా సింగ్ కరోనా.. జాగింగ్ నుంచి తిరిగొచ్చాక..?

గురువారం, 20 మే 2021 (19:22 IST)
Milka singh
అథ్లెటిక్స్ లెజెండ్ మిల్కా సింగ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు బుధవారం సాయంత్రం కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఛండీగఢ్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిల్కా సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన భార్య నిర్మల్ కౌర్ తెలిపారు. 
 
మిల్కా సింగ్ ఇంట్లో పని చేసే ఒకరికి కొద్ది రోజుల క్రితం కరోనా సోకినట్లు తేలింది. దీంతో కుటుంబ సభ్యులు టెస్టులు చేయించుకున్నారు. మిల్కా సింగ్‌కు హై ఫీవర్ వచ్చిందని.. కానీ టేస్ట్, స్మెల్ తెలుస్తున్నాయని ఆయన భార్య తెలిపారు. ''నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. బుధవారం రోజు జాగింగ్ నుంచి తిరిగొచ్చాక నాకు పాజిటివ్ అనే రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయాను. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను''అని 91 ఏళ్ల ఏళ్ల మిల్కా సింగ్ తెలిపారు. 
 
మిల్కా సింగ్, ఆయన కుమారుడు, గోల్ఫర్ అయిన జీవ్ మిల్కా సింగ్ కరోనాపై పోరు కోసం రూ.2 లక్షల విరాళమిచ్చాడు. ది ఫ్లైయింగ్ సిఖ్‌గా గుర్తింపు పొందిన మిల్కా సింగ్.. ఎన్నో చిరస్మరణీయ రేసుల్లో పాల్గొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా మిల్ఖా సింగ్ గుర్తింపు పొందారు.
 
1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచారు. 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. భారత ప్రభుత్వం అతడ్ని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు