క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ క్రికెట్ కెరీర్కు స్వస్తి పలికాడు. కేవలం 29 యేళ్ళకే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. ఈ ట్రినిడాడ్ ఆటగాడు తన నిర్ణయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
పరిమిత ఓవర్ల ఫార్మెట్లో వెస్టిండీస్ తరపున 167 మ్యాచ్లలో ప్రాతినిథ్యం వహించిన ఆయన కెరీర్కు తెరపడింది. తన కెరీర్లో వన్డే ఫార్మాట్లో 61 మ్యాచ్లలో ఆడి 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్తో 1,983 పరుగులు సాధించాడు. ఇక టీ20 ఇంటర్నేషనల్స్ వెస్టిండీస్ తరపున అత్యధికంగా 2,275 పరుగులు చేసిన ఆటగాడిగా ఆయన రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్తో ఆయన స్ట్రైక్ రేట్ 136.39గా ఉంది. పొట్టి ఫార్మాట్లో కరేబియన్ జట్టు తరపున 106 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదే అంశంపై పూరన్ మాట్లాడుతూ, 'చాలా ఆలోచన, సమీక్ష తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. మనం ప్రేమించే ఈ ఆట మనకు ఎంతో ఇచ్చింది.. ఇస్తూనే ఉంటుంది. ఆనందం, లక్ష్యం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం' అని పూరన్ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొన్నాడు.
ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ 2016లో పాకిస్థాన్పై టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అంతకు రెండేళ్ల ముందు 2014లో అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచకప్ వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో వన్డే అరంగేట్రం చేసిన పూరన్... 2019 క్రికెట్ ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో చోటుదక్కించుకున్నాడు.
అతని నాయకత్వ లక్షణాలను గుర్తించి 2021 టీ20 ప్రపంచ కప్కు వైస్-కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత 2022లో ఆరు నెలల పాటు రెండు వైట్-బాల్ ఫార్మాట్లలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. "కెప్టెన్గా జట్టును నడిపించడం అనేది నేను ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకునే గౌరవం" అని పూరన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.