ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. సాహా స్థానంలో పార్థీవ్ పటేల్‌కు చోటు..

బుధవారం, 23 నవంబరు 2016 (10:42 IST)
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 26 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ మంగళవారం 16 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా జట్టులో ఒక మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.

వికెట్‌ కీపర్‌ సాహా స్థానంలో పార్థీవ్‌ పటేల్‌కు చోటు కల్పించింది. ఈ మార్పు మొహాలీ వేదికగా జరిగే మూడో టెస్టుకు మాత్రమే అని బీసీసీఐ ట్విట్టర్‌లో పేర్కొంది. సాహా గాయం బారిన పడటంతో ఈ మార్పు చేసినట్లు బీసీసీఐ ట్విటర్‌లో తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. భారత్ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. రెండో ఇన్సింగ్స్‌లో ఇంగ్లండ్ 158 పరుగులకే కుప్పకూలింది.

భారత్ తొలి ఇన్సింగ్స్‌లో 455, రెండో ఇన్సింగ్స్‌లో 205 పరుగులు చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్‌లో 255, రెండో ఇన్సింగ్స్‌లో 158 పరుగులు చేసింది. రెండు ఇన్సింగ్స్‌ల్లోనూ అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు.

వెబ్దునియా పై చదవండి