టీ20 జట్టుకు కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. ప్రపంచకప్ దృష్ట్యా ఎంపిక

బుధవారం, 7 జులై 2021 (12:56 IST)
ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 క్రికెటర్లలో ఒకరైన రషీద్ ఖాన్‌కు పెద్ద బాధ్యతలు అప్పగించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. రషీద్ ఖాన్‌ను ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించింది.

రషీద్ ఖాన్‌ను టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నజ్‌బుల్లా జద్రాన్‌ను టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. వన్డే, టెస్టు జట్లకు హస్మతుల్లా షాహిది కెప్టెన్ అయ్యారు.
 
రషీద్ ఖాన్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ టీ20, వన్డే జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. అతని కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ 16వన్డేల్లో ఆరు గెలిచింది. 2019 ప్రపంచకప్ తరువాత, రషీద్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు ముందు గుల్బాదిన్ నాయిబ్ స్థానంలో రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా నియమించారు.
 
అయితే, ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఎక్కువరోజులు ఉండలేదు. జట్టు కెప్టెన్సీకి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తుండగా.. రషీద్ ఖాన్ స్థానంలో అస్గర్ ఆఫ్ఘన్‌ను కెప్టెన్‌గా నియమించింది. కానీ బోర్డు ఈ ఏడాది మేలో అతనిని తొలగించింది. ఇప్పుడు మరోసారి మార్పులు చేసింది.
 
రషీద్ ఖాన్‌ను ఆటతీరు ఆధారంగా జట్టు కెప్టెన్‌గా చెయ్యాలని నిర్ణయించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా.. రషీద్‌ఖాన్ నియామకం జరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ ఏడాది UAEలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని రషీద్ ఖాన్‌ను జట్టుకు కెప్టెన్‌గా మార్చారు. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు